డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు
డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత
- జూన్ 1 నుండి రెండు దశల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
- ఐదేళ్లలోపు పిల్లలకు ఓఆర్ఎస్, జింక్ పంపిణీ
- మారుమూల, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో శిశు మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డయేరియా నివారణకు జూన్ 1 నుండి జూలై 31 వరకు రెండు దశల్లో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 1 నుండి 15 వరకు మొదటి దశలో జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, జూన్ 16 నుండి జూలై 31 వరకు రెండవ దశలో ప్రతి గ్రామంలో ఓఆర్ఎస్, జింక్ డిపోలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలను అందుబాటులో ఉంచుతారని, ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలు, స్లమ్ ఏరియాలపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు.
డయేరియా వల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోతుందని, లక్షణాలు కనిపించిన వెంటనే ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందించాలని, దానిని తయారుచేసే విధానాన్ని తల్లులకు వివరించాలని డాక్టర్ అనిత సూచించారు. ఈ ప్రచారంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షిత తాగునీటి వాడకం, తల్లిపాల ప్రాముఖ్యత మరియు విటమిన్ 'ఎ' సిరప్ అందించడంపై అవగాహన కల్పిస్తామన్నారు. జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ 'రోటా వైరస్' టీకాను తప్పనిసరిగా వేయించాలని, చిన్నపాటి జాగ్రత్తలు మరియు ముందస్తు నివారణ చర్యల ద్వారా పిల్లలను డయేరియా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు