ధాన్యం దిగుమతి నిబంధనల ప్రకారమే జరగాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు
రైస్ మిల్లులు, గోదాముల్లో ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించి, కేటాయించిన రైస్ మిల్లులు మరియు గోదాములకు తరలించిన ధాన్యం దిగుమతి ప్రక్రియను నిబంధనల ప్రకారం సజావుగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. శనివారం ఆయన జైపూర్ మండలం రసూల్ పల్లిలోని బి.వై.ఎస్. రైస్ మిల్లును మండల తహసిల్దార్ వనజా రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, అక్కడి నుండి మిల్లులకు చేరిన ధాన్యం దిగుమతిని వేగవంతం చేయాలని సూచించారు. ఇందుకోసం తగినంత మంది హమాలీలను అందుబాటులో ఉంచడం జరిగిందని, ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన దిగుమతి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని తన ఛాంబర్ లో జిల్లా పౌర సంబంధాల అధికారి బ్రహ్మ రావు, లక్షెట్టిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎ.పి.ఎం., ఐ.కె.పి. గుత్తేదారులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు