ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్
రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జైపూర్ మండలంలోని బెజ్జాల, కిష్టాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఓం, అన్నపూర్ణ రైస్ మిల్లులను, అలాగే సుముఖ గోదామును తహసిల్దార్ వనజా రెడ్డితో కలిసి సందర్శించి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
హమాలీల కొరతను అధిగమించేందుకు స్థానికులను వినియోగిస్తూ ఎగుమతి, దిగుమతులను వేగవంతం చేశామని కలెక్టర్ వివరించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం పాడవకుండా భద్రపరిచేందుకు పెద్దపల్లి, కరీంనగర్లలో రెండు గోదాములను సిద్ధం చేశామని, రవాణా కోసం ట్రాక్టర్లను సైతం వాడుకునేలా ప్రభుత్వం వీలు కల్పించిందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్దేశిత సీఎంఆర్ (CMR) లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మిల్లర్లను, అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు