ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు
వేమనపల్లి, కోటపల్లి, భీమారం మండలాల్లో అదనపు కలెక్టర్ తనిఖీలు
మిల్లుల వద్ద లారీల నిల్వ సమయాన్ని తగ్గించాలని సూచన
జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం ఆయన జిల్లాలోని వేమనపల్లి మండలం గొర్లపల్లి, కొత్తపల్లి, దస్నాపూర్, నీల్వాయి గ్రామాలలో, అలాగే కోటపల్లి మండలం సర్వాయిపేట, భీమారం మండలం అర్కపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ధాన్యం తరలింపునకు అదనపు లారీలు సమకూర్చాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులు, గోదాములకు తరలించడం జరుగుతుందని, ఈ క్రమంలో తరలించబడిన ధాన్యాన్ని లారీల నుంచి త్వరితగతిన దిగుమతి వేగవంతం చేసి, లారీల నిల్వ సమయాన్ని తగ్గించాలని సూచించారు. అవసరమైన మేరకు లారీలను సమకూర్చే విధంగా గుత్తేదారులు సహకరించాలని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు