ధాన్యం తరలింపునకు అదనపు లారీలు కేటాయించాలి
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోండి
రైస్ మిల్లును సందర్శించి, అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ వి.రాములు
ధాన్యం తరలింపునకు అదనపు లారీలు కేటాయించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. బుధవారం ఆయన లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో గల జై యోగేశ్వర రైస్ మిల్లును తహసీల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం వరి ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన విధంగా రైస్ మిల్లులకు తరలించే క్రమంలో, లారీల నుండి ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా లారీల నిల్వ సమయాన్ని తగ్గించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం లక్షెట్టిపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో ఐకేపీ, పీఏసీఎస్ సీసీలు, సెక్టార్-1 సిబ్బంది, మరియు రవాణా గుత్తేదారుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేయాలని రవాణా కాంట్రాక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి ప్రక్రియల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి, రైతులకు సకాలంలో సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు