ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన... ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ సూచనలు
ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన... ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ సూచనలు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం: మండలంలోని పెనుగొలను గ్రామ సహకార సంఘం ప్రాంగణంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సహకార సంఘ అధ్యక్షుడు నాగళ్ళ మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా నాగళ్ళ మురళి మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్న సాగు విధానాలను రైతులు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
వ్యవసాయ శాస్త్రవేత్త డా. పి.ఎన్. శివప్రసాద్ మాట్లాడుతూ, మధ్య-తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరగడం వల్ల ఎల్ నినో ఏర్పడుతుందని వివరించారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై పడుతుందని తెలిపారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. పి. రత్నకుమారి మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా తక్కువగా కురిసే పరిస్థితులు ఏర్పడవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే పప్పు దినుసులు, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
వ్యవసాయ విస్తరణ విభాగం అధికారి డా. ఇ. వెంకటరెడ్డి మాట్లాడుతూ, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పత్తి, మిరప పంటలను రసం పీల్చే పురుగులు, ఆకు ముడత తెగుళ్ల నుంచి కాపాడేందుకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.
మండల వ్యవసాయ అధికారి వల్లభనేని హరీష్ మాట్లాడుతూ, ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవడంతో పాటు నష్టాల నుంచి రక్షణ పొందేందుకు ప్రధానమంత్రి పంట బీమా యోజన కింద పంటలకు బీమా చేయించుకోవాలని కోరారు.
విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్ కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు లభించే రుణాలు, ఇతర సౌకర్యాలపై అవగాహన కల్పించారు. సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా రైతులు ఐక్యంగా ఉంటేనే వ్యవసాయ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘ డైరెక్టర్లు కోరంపల్లి పుల్లారావు, సంగెపు ఏలయ్య, మాజీ సర్పంచి సంగెపు నారాయణ, నీటిపారుదల సంఘ అధ్యక్షుడు కొండేటి వెంకటప్పయ్య, మోటకట్ల రాజారెడ్డి, తోట నరసింహారావు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు, పంది వెంకట్రావు, యనమద్ది విజయకుమార్, సహకార సంఘ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.