ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి
ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: వడదెబ్బ, పొగాకు దుష్పరిణామాలపై విస్తృత అవగాహన
మంచిర్యాల పట్టణంలో అధికారుల ప్రత్యేక ప్రచారం.. బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తాలో అవగాహన కార్యక్రమాలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొగాకు వాడకం వల్ల కలిగే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలపై మంచిర్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తాలో అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నందున ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకూడదని సూచించారు. ప్రయాణికులు, బయట పనిచేసేవారు ఎల్లప్పుడూ తాగునీటిని, ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచుకోవాలని, ఒకవేళ తల తిరగడం, వికారం, తీవ్రమైన అలసట, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు.
అనంతరం బెల్లంపల్లి చౌరస్తాలో ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో అధికారులు పాల్గొని, వడదెబ్బ నివారణకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. సమాజంలో పొగాకు వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ ప్రజలు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో సాగిన ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో ఆర్టీసీ సమన్వయకర్త శ్రీమతి భారతి, జిల్లా మాస్ మీడియా అధికారి డిపి రావు, భీమయ్య, ఎపిడి బుక్క వెంకటేశ్వర్, మాలజిస్ట్ శ్రీ సుమన్ తదితరులు పాల్గొన్నారు