ఎం.టి.ఎస్ ఉపాధ్యాయులను వెంటనే రెగ్యులర్ చేయాలి
ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం కాపాడాలి : యుటిఎఫ్ జిల్లా నాయకులు
అనంతపురం, మే 12:
ఎం.టి.ఎస్ ఉపాధ్యాయులను వెంటనే రెగ్యులర్ చేసి, వారికి అన్ని ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం 10 గంటలకు డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ అనంతపురం జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం “సమాన పనికి సమాన వేతనం” అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఎం.టి.ఎస్ ఉపాధ్యాయులతో వెట్టి చాకిరి చేయించుకుంటోందని విమర్శించారు. ఇది ఉపాధ్యాయ వృత్తిని అగౌరవపరచడమేనని అన్నారు.
డీఎస్సీ 1998, డీఎస్సీ 2008 అభ్యర్థులకు అప్పట్లోనే నియామకాలు ఇవ్వకుండా ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వారి కుటుంబాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని పేర్కొన్నారు. సమయానికి నియామక పత్రాలు అందించి ఉంటే వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవితం గడిపేవని తెలిపారు.
2008 డీఎస్సీలో 30 శాతం ఎస్జీటీలు, 70 శాతం బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మెరిట్ ఉన్న అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మంది ఎం.టి.ఎస్ ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అందువల్ల ప్రభుత్వం వెంటనే వారిని రెగ్యులర్ చేసి, వారికి రావలసిన అన్ని సౌకర్యాలు కల్పించి ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, గౌరవాధ్యక్షుడు వెంకటరామరెడ్డి, సహాధ్యక్షుడు రామప్ప చౌదరి, కోశాధికారి సరళ, జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.