ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం.. సామాజిక వర్గాల సర్వేపై అధికారుల దృష్టి
ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం.. సామాజిక వర్గాల సర్వేపై అధికారుల దృష్టి
ప్రతి ఇంటికీ వెళ్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వివరాలు సేకరించాలి
తిరువూరు ఎంపీడీవో రవిబాబు ఆదేశాలు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన చర్యలపై దృష్టి సారించిన అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు, సమాచార సేకరణ చేపడుతున్నారు.
తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రవిబాబు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై కార్యదర్శులకు పలు సూచనలు చేశారు.
గ్రామాల్లో చేపట్టనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను క్షుణ్ణంగా సేకరించాలని సూచించారు.
వివరాల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి సకాలంలో ఉన్నతాధికారులకు అందజేయాలని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శుల బాధ్యతలు, చేపట్టాల్సిన చర్యలపై ఎంపీడీవో అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.