గండ్రపల్లిలో వరుస మరణాలు కలకలం
గండ్రపల్లిలో వరుస మరణాలు కలకలం ‘కీడు’ భయంతో ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా చోటుచేసుకున్న వరుస మరణాలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాలంలో మొత్తం 28 మంది వివిధ కారణాలతో మరణించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ పరిణామాలతో భయాందోళనకు గురైన గ్రామ ప్రజలు, గ్రామానికి ఏదో ‘కీడు’ సోకిందనే నమ్మకానికి వచ్చారు. పురోహితుడి సూచన మేరకు గ్రామాన్ని ఒక రోజు పూర్తిగా ఖాళీ చేయాలని నిర్ణయించారు.
అందులో భాగంగా తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి, డప్పు చాటింపు ద్వారా గ్రామస్థులు అందరూ బయటకు వెళ్లి సమీప పొలాల్లో గడిపారు. అక్కడే ప్రత్యేకంగా ‘కీడు వంటలు’ నిర్వహించి గ్రామానికి పట్టిన పీడ తొలగుతుందని విశ్వసించారు.
ఇదిలా ఉండగా, తక్కువ వ్యవధిలో ఎక్కువ మరణాలు సంభవించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మరణాలకు గల అసలు కారణాలను వెలికితీయాలని కోరుతున్నారు.