గంపలగూడెం మండలానికి మరో గౌరవం.. పలువురికి రాష్ట్రస్థాయి సత్కారం
తిరువూరు, ఆగస్టు 3: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలానికి చెందిన పలువురు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు, ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికై సత్కారం అందుకున్నారు. సామాజిక, సేవా, సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.
గంపలగూడెం మండలం నుంచి మురళీకృష్ణకు ఉత్తమ వ్యాపార సేవా రత్న పురస్కారం, సునీతకు భగవద్గీత ప్రచార వైభవ మహిళా రత్న పురస్కారం, పద్మనాభుని సర్వేశ్వరరావుకు ఏపీ శ్రీ కోదండరామస్వామి ఉత్తమ ఆలయ చైర్మన్ పురస్కారం, నాగ లక్ష్మణరావుకు వాసవి సేవా సమాజ వైభవ సామ్రాట్ పురస్కారం ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ చాముండేశ్వరి మహర్షి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, సినీ నటుడు జనార్ధనరావు, సీవీ రామన్ అకాడమీ ప్రధాన కార్యదర్శి, నిర్వాహకుడు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు విజేతలను ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
గంపలగూడెం మండలానికి చెందిన పలువురు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల స్థానిక ప్రజలు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు అభినందనలు వెల్లువెత్తాయి.