గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో తమ తాత కాకా వెంకటస్వామి స్థాపించిన విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తనను బాధించిందని, త్వరలోనే అవసరమైన బెంచీలను అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్తూ, ప్రతి విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
మరోవైపు ఈ కార్యక్రమానికి వస్తుండగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియాతో వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ, ప్రజల అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. గతంలో గూడెం ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, తాను అలాంటి విషయాలను పట్టించుకోనని, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ప్రజల ప్రయోజనాలు మరియు ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయడమే తన ఆకాంక్ష అని ఎంపీ స్పష్టం చేశారు