గుంటూరులో పోస్టర్ ఫ్రీ సిటీపై కఠిన చర్యలు
గుంటూరులో పోస్టర్ ఫ్రీ సిటీపై కఠిన చర్యలు
గుంటూరు, ఏప్రిల్ 30:
నగరాన్ని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చే లక్ష్యంతో గుంటూరు నగరపాలక సంస్థ “పోస్టర్ ఫ్రీ సిటీ” కార్యక్రమాన్ని కఠినంగా అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది.
జిల్లా కలెక్టర్, జీఎంసీ ప్రత్యేక అధికారి సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. నగరంలో అనధికార పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించేందుకు 15 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
ఇప్పటికే పట్టణ ప్రణాళిక అధికారుల పర్యవేక్షణలో పలు ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు, హోర్డింగ్స్ తొలగించారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి 12 ప్రత్యేక నిఘా బృందాలను నియమించారు.
కమిషనర్ హెచ్చరికలు:
అనుమతి లేకుండా పోస్టర్లు అంటిస్తే మొదటిసారి రూ.5 వేల జరిమానా
రెండోసారి రూ.10 వేల జరిమానా
మూడోసారి రూ.50 వేల జరిమానా, పోలీస్ కేసు నమోదు
గడువు తర్వాత పోస్టర్లు అంటించిన వారు స్వయంగా శుభ్రం చేసి పెయింటింగ్ చేయాలి
రోడ్లు, విద్యుత్ స్తంభాలు, డివైడర్లు, బ్రిడ్జిల గోడలు, కార్యాలయాల గోడలపై పోస్టర్లు, ఫ్లెక్సీలు కట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అదేవిధంగా అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్లపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఫ్లెక్సీపై ప్రింటర్ వివరాలు తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే ఇరువురిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రాత్రివేళల్లో పోస్టర్లు అంటించే వారిని పట్టుకోవడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగర సుందరీకరణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు.