IFAT India 2026 ప్రదర్శనలో గ్రేటర్ వరంగల్ కమిషనర్.
వరంగల్: ముంబైలో నిర్వహిస్తున్న IFAT India 2026 మూడు రోజుల ప్రదర్శనలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పాల్గొన్నారు. ప్రదర్శన చివరి రోజైన శుక్రవారం వివిధ సంస్థలు ప్రదర్శించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు.
మంచినీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సీవరేజ్, రీసైక్లింగ్ తదితర రంగాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలు, పరికరాలపై వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా వరంగల్ నగరంలో త్వరలో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థకు అవసరమైన పైపుల అనుసంధానం, సీవరేజ్ శుద్ధి, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంపై సంబంధిత సంస్థల ప్రతినిధులతో చర్చించారు.
అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఆధునిక పద్ధతులు, వ్యర్థాల సేకరణ–ప్రాసెసింగ్ విధానాలు, మున్సిపల్ సేవలకు సంబంధించిన ఆధునిక బిల్లింగ్ పరికరాలపై సంస్థల ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ నగరంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అవకాశాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.