హైదరాబాద్లో ఇంధన కొరత లేదు.. పుకార్లు నమ్మొద్దు
హైదరాబాద్లో ఇంధన కొరత లేదు.. పుకార్లు నమ్మొద్దు: సీపీ వీసీ సజ్జనర్
హైదరాబాద్: నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పందించారు. ఇంధన నిల్వలపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
60 రోజులకు సరిపడా నిల్వలు సిద్ధం
బుధవారం టీజీసీసీసీ (TGCCC)లో జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన, ఐఏఎస్, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత మరియు సివిల్ సప్లై అధికారులతో కలిసి సీపీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
అనవసరంగా ఫుల్ ట్యాంకులు చేయించవద్దు
పుకార్ల వల్ల ప్రజలు ఒక్కసారిగా బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగిందని సీపీ తెలిపారు.
ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల అమ్మకాలు జరగ్గా, 23 నాటికి అది 6,400 కిలోలీటర్లకు చేరిందని పేర్కొన్నారు.
దీనివల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయని, అది కేవలం రద్దీ వల్ల ఏర్పడిన పరిస్థితి మాత్రమేనని వివరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
బాటిళ్లు లేదా డబ్బాల్లో లూజ్ పెట్రోల్ విక్రయిస్తే బంక్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచామని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 186 బంకుల్లో సరఫరా సజావుగా సాగుతోందని ఆమె ధృవీకరించారు.