హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు
హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు
హైదరాబాద్, మే 17: పోక్సో కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్టు వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న వేళ, ఈ కేసు విచారణకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మహిళా జడ్జి జస్టిస్ మాధవీ దేవిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ట్రోలింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా పోస్టులు, కామెంట్లు పెట్టిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్టు అవకాశాలు కనిపించడంతో ఆయన ముందస్తు బెయిల్, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఈ విచారణ నేపథ్యంలో సోషల్ మీడియాలో జస్టిస్ మాధవీ దేవిని లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇదిలా ఉండగా, కేసులో బాధిత బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపైనా పోలీసులు చర్యలు ప్రారంభించారు. బాధితురాలి గోప్యతకు భంగం కలిగేలా కొన్ని సోషల్ మీడియా ఖాతాలు పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. దీనిపై మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు పలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలను గుర్తించి, వాటికి సంబంధించిన యూఆర్ఎల్ వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. బాధిత బాలిక వివరాలను బహిర్గతం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులను షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.