ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తున్నారా..? ముందుగా పోలీసులకు చెప్పండి.. లేదంటే దొంగల టార్గెట్ అయ్యే ప్రమాదం!
NTODAY NEWS చాట్రాయి:
ఇంటికి తాళం వేసి వెళ్లిపోతే.. దొంగలకు ఆహ్వానం పలికినట్టే” అంటూ చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ ప్రజలను అప్రమత్తం చేశారు. మండలంలో వరుస దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంగళవారం ఎర్రవారి గూడెం, కొత్తగూడెం, సోమవరం గ్రామాల్లో మైక్ అనౌన్స్మెంట్ నిర్వహించిన ఎస్ఐ రామకృష్ణ.. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. “తాళం వేసి ఉన్న ఇళ్లపైనే దొంగల కన్ను ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితకాల కష్టార్జితాన్ని పోగొట్టే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు.
ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వడం, ఇంటి చుట్టూ లైట్లు ఆన్లో ఉంచడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో కొత్తగా కనిపించే వ్యక్తులు, పాత సామాన్లు కొనుగోలు చేసే వారు, సేల్స్మెన్ ముసుగులో తిరిగే అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.
“ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వండి. మీ ఒక్క ఫోన్ కాల్ పెద్ద నేరాన్ని అడ్డుకోవచ్చు” అని ఎస్ఐ తెలిపారు.
రాత్రి వేళల్లో కిటికీల దగ్గర నిద్రించే వారు బంగారు గొలుసులు, నగలు ధరించవద్దని, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బీరువాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు.
గ్రామాల్లో రాత్రిపూట పోలీస్ గస్తీని మరింత కట్టుదిట్టం చేశామని, ప్రజల భద్రత కోసం పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉన్నారని ఎస్ఐ రామకృష్ణ వెల్లడించారు. “ప్రజల సహకారంతో చాట్రాయిని నేర రహిత మండలంగా తీర్చిదిద్దుతాం” అని ధీమా వ్యక్తం చేశారు.