ఇన్స్టాలో పరిచయం.. ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. మూడు నెలల తర్వాత హర్యానాలో పట్టివేత
మైనర్ బాలికను క్షేమంగా రక్షించిన పోలీసులు.. నిందితుడి కోసం సుదీర్ఘ గాలింపు
గుంటూరు: సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన మైనర్ బాలికను మాయమాటలతో ఇంటి నుంచి తీసుకెళ్లిన యువకుడిని పోలీసులు మూడు నెలల సుదీర్ఘ గాలింపు అనంతరం హర్యానాలో అదుపులోకి తీసుకున్నారు. బాలికను సురక్షితంగా రక్షించి స్వస్థలానికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు పట్టాభిపురం ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికకు బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన జాన్సైదాతో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఆ పరిచయం సన్నిహితంగా మారింది. బాలిక నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు బయటకు వెళ్దామని చెప్పి ఆమెను వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక ఇంట్లో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా నగదు, బంగారు ఆభరణాలతో నిందితుడితో వెళ్లిపోయింది. మొదట గుంటూరు నుంచి బైక్పై నెల్లూరుకు చేరుకున్న ఇద్దరూ.. అక్కడి నుంచి చెన్నై, కోయంబత్తూరు మీదుగా కేరళలోని పాలక్కాడ్కు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు తరచూ ఫోన్ నంబర్లు, సిమ్ కార్డులు మార్చడం, ఆన్లైన్ లావాదేవీలకు దూరంగా ఉండటం వంటి చర్యలతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్నేహితుల సహకారంతో తన ఆచూకీని గోప్యంగా ఉంచినట్లు గుర్తించారు.
పోలీసులు పాలక్కాడ్ చేరుకునేలోపే నిందితుడు అక్కడి నుంచి సికింద్రాబాద్ మీదుగా హర్యానాకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు.
హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్
మూడు నెలలుగా బాలిక ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం పోలీసుల దర్యాప్తు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో బాలిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆమె తల్లికి ఫోన్ కాల్ రావడం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. ఆ కాల్కు సంబంధించిన సాంకేతిక వివరాలను పరిశీలించిన పోలీసులు ఐపీ చిరునామా తదితర ఆధారాల ద్వారా నిందితుడి కదలికలను గుర్తించారు.
చివరకు నిందితుడు హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను కూడా సురక్షితంగా రక్షించారు.
అనంతరం నిందితుడిని, బాలికను విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చి.. అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయపరమైన ప్రక్రియ పూర్తిచేసి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
నిందితుడు జాన్సైదాపై గతంలోనే పర్చూరు పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై వివిధ ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.