ఇరాన్పై దాడులు ఆపాలి
ఇరాన్పై దాడులు ఆపాలి – సిపిఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విస్సన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం వల్లే ప్రపంచంలో యుద్ధాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. క్యూబాపై కూడా ఆంక్షలు విధించే స్థాయికి అమెరికా దిగజారిందన్నారు.
ఈ యుద్ధ ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడుతుందని, పెట్రోలు, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని హరినాథ్ అన్నారు. యుద్ధం వల్ల దేశానికి నష్టం లేదని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పుడు కరోనా తరహా పరిస్థితులు రావొచ్చని హెచ్చరిస్తూ ప్రజలను సిద్ధంగా ఉండమంటున్నారని విమర్శించారు.
అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల భారత రైతాంగానికి నష్టం జరిగిందని, ఇది రైతులకు ఉరితాడు బిగించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వగురువుగా చెప్పుకునే మోదీ అమెరికా ఒత్తిడికి తలొగ్గారని ఆరోపించారు.
షహీద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలో ఇరాన్పై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం బాధాకరమన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువ వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ ఆశయాలను వక్రీకరించకూడదన్నారు. హిందూ-ముస్లిం ఐక్యతను దెబ్బతీయే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హెచ్చరించారు.
విజయవాడలో ఈ నెల 30న ధర్నా చౌక్ వద్ద సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో యుద్ధ వ్యతిరేక బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.