జగ్గయ్యపేటలో బిల్లుల వివాదం..! రిటైర్డ్ కమిషనర్ ఇంటి వద్ద కాంట్రాక్టర్ల హైడ్రామా
బిల్లుల సంతకాల కోసం ఒత్తిడి.. వాగ్వాదం.. ఉద్రిక్తత..! రిటైర్డ్ కమిషనర్ అస్వస్థత
ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీలో బిల్లుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ డీటీ కృష్ణారావు ఇంటి వద్ద కాంట్రాక్టర్లు హడావుడి చేయడం కలకలం రేపింది.
చేసిన పనులకు సంబంధించిన బిల్లులతో పాటు మరికొన్ని వివాదాస్పద బిల్లులపై సంతకాలు తీసుకునేందుకు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవీ విరమణ తర్వాత కూడా సంబంధిత ఫైళ్లు ఆయన వద్దకే రావడం ఏమిటన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
గత నెల 31న పదవీ విరమణ చేసిన తర్వాత నుంచి కొందరు కాంట్రాక్టర్లు తరచూ ఆయన నివాసానికి వెళ్లుతున్నట్లు సమాచారం. తాజాగా ఈరోజు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
కాంట్రాక్టర్ ఏవీ రావు ఆధ్వర్యంలో కొందరు వాగ్వాదానికి దిగడమే కాకుండా దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్నవారు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో ఆందోళనకు గురైన రిటైర్డ్ కమిషనర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే స్థానికులు ఆయనకు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.
మున్సిపల్ రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయి..? కొత్త కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఈ వ్యవహారం ఎందుకు కొనసాగుతోంది..? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
బిల్లుల వెనుక పెద్ద వ్యవస్థ ఉందా..? రికార్డుల లీకేజీకి బాధ్యులు ఎవరు..? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.