జి.కొండూరులో ఎమ్మెల్యే సడన్ ఎంట్రీ
జి.కొండూరులో ఎమ్మెల్యే సడన్ ఎంట్రీ.. మధ్యాహ్న భోజనంపై సీరియస్ హెచ్చరిక!
ఎన్టీఆర్ జిల్లా, మార్చి 26:
జి.కొండూరు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకంపై అకస్మికంగా దాడి చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అధికారులను అలర్ట్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా స్కూల్కి చేరుకున్న ఎమ్మెల్యే, నేరుగా వంటశాలకు వెళ్లి భోజనం తయారీ విధానం, నిల్వలు, పరిశుభ్రతపై సవివరంగా పరిశీలించారు.
భోజనం రుచి, నాణ్యతపై స్వయంగా తనిఖీ చేయడానికి విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేసిన ఎమ్మెల్యే, “పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు” అని గట్టిగా హెచ్చరించారు. కొన్నిచోట్ల చిన్నపాటి లోపాలు గమనించిన ఆయన, వాటిపై వెంటనే సిబ్బందిని ప్రశ్నిస్తూ క్లాస్ తీసుకున్నారు.
విద్యార్థులతో మాట్లాడి, భోజనం సరైనదిగా ఉందా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తమ సమస్యలు చెప్పడంతో వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
“మధ్యాహ్న భోజనం పథకం పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు” అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. దీంతో పాఠశాల సిబ్బందిలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.