జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు వదంతులను నమ్మవద్దు
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు వదంతులను నమ్మవద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఎక్కడా లేదని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య వదంతుల కారణంగా ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతూ, ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి ఇంధనం నింపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.
జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలగడంతో పాటు అనవసర గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నిర్ధారించని సమాచారాన్ని నమ్మకూడదని, అలాంటి సమాచారాన్ని ఇతరులకు పంపించడం ద్వారా వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజలు తమ సాధారణ అవసరాల మేరకే ఇంధనం వినియోగించుకోవాలని, ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని కోరారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడితే, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.