జయహో బీసీ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో రాజకీయ సాధికారతకు బాటలు: లోకేశ్
ఏపీ కేబినెట్ బీసీలకు రాజకీయ సాధికారత కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యం పెంచుతూ గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ఈ నిర్ణయం బీసీ వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు గ్రామ, పట్టణ పాలనలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా ఇది చారిత్రాత్మక ముందడుగు అని అభివర్ణించారు.
బీసీలకు నిర్ణయాధికారంలో తగిన స్థానం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్థానిక పాలనలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.