కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో శ్రీరామ నవమి వేడుకలు
కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో శ్రీరామ నవమి వేడుకలు: బీఆర్ఎస్ అధినేతను ఆహ్వానించిన ఆలయ కమిటీ
ఎర్రవెల్లి: సిద్ధిపేట జిల్లా, రూరల్ మండలంలోని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వగ్రామమైన చింతమడకలో శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ట మరియు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
ఈ నెల 25, 27 తేదీల్లో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ ఆలయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం కేసీఆర్ గారిని కలిశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
కేసీఆర్ ని కలిసిన వారిలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఆకుల రామ గౌడ్, పెండల గణేష్, బైరి నర్సింహా రెడ్డి, వాతం శివ, పడకండి విశ్వనాధం, ఎల్లప్పగారి పోచయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామ విశేషాలను, ఉత్సవ ఏర్పాట్లను కమిటీ సభ్యులు కేసీఆర్ కి వివరించారు.