కొమ్మిరెడ్డిపల్లిలో నెల రోజులు కాకముందే దెబ్బతిన్న తారు రోడ్డు వ్యవసాయ వాహనాలతో రహదారి ధ్వంసం.. గ్రామస్థుల ఆందోళన
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల నిర్మించిన తారు రహదారి నెల రోజులు కూడా పూర్తికాకముందే పలు చోట్ల దెబ్బతినడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ రహదారికి ఎట్టకేలకు కొత్త రహదారి నిర్మాణం జరగడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేయగా, కొద్ది రోజులకే రహదారి దెబ్బతినడంతో ఆవేదనకు గురవుతున్నారు.
కొమ్మిరెడ్డిపల్లి గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో కీలకమైన ఈ రహదారి నిర్మాణం కోసం స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు నిరంతరం కృషి చేయడంతో పాటు, కూటమి ప్రభుత్వ సహకారంతో రహదారి నిర్మాణం ఇటీవల పూర్తయింది. కొత్త రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామస్థులకు రాకపోకల ఇబ్బందులు తొలగుతాయని భావించారు.
అయితే నిర్మాణం పూర్తై నెల రోజులు కూడా గడవకముందే రహదారి పలు ప్రాంతాల్లో దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. గొల్లగూడెం, ముష్టికుంట్ల గ్రామాలకు చెందిన కొందరు రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం దుక్కి దున్నేందుకు ఉపయోగించే ఫుల్ వీల్స్, దమ్ము చక్రాలను కొత్త రహదారిపై నడపడం వల్లే రహదారి దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
కొత్తగా నిర్మించిన రహదారి దెబ్బతినడంతో వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్థానికులు పేర్కొంటున్నారు. వ్యవసాయ పనులు ఎంత ముఖ్యమో, ప్రజాధనంతో నిర్మించిన ప్రజా ఆస్తులను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు.
రహదారి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు వృథా కాకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. దెబ్బతిన్న ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు, కొత్తగా నిర్మించిన రహదారులపై భారీ వ్యవసాయ పరికరాలు, రహదారి ఉపరితలాన్ని దెబ్బతీసే వాహనాలను వినియోగించకుండా రైతులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.