కోట్లతో నిర్మించిన రహదారులను కాపాడాలి..!
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కృషికి గండికొడుతున్న ఓవర్లోడ్ ఇసుక లారీలు
చింతలపూడి: ఒకప్పుడు గుంతలు, దెబ్బతిన్న రహదారులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చింతలపూడి మండలం, నగర పంచాయతీ పరిధిలో ఇప్పుడు అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ప్రత్యేక చొరవతో కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ప్రధాన రహదారులను నాణ్యంగా నిర్మింపజేశారు. దీంతో ప్రయాణం సౌకర్యవంతంగా మారి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన ఈ రహదారులకు ఇప్పుడు ఓవర్లోడ్ లారీలు ముప్పుగా మారాయి. ముఖ్యంగా ఇసుక, పామాయిల్, ఇతర భారీ సరుకులతో అనుమతించిన పరిమితికి మించి లోడ్లు మోసుకుంటూ తిరుగుతున్న లారీలు కొత్త రహదారులపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న భారీ వాహనాల రాకపోకల కారణంగా తాజాగా నిర్మించిన రోడ్లలో పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
ప్రజల ప్రయోజనాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రహదారులు కొద్ది కాలంలోనే దెబ్బతింటే ప్రభుత్వ నిధులు వృథా కావడంతో పాటు ప్రజలు మళ్లీ పాత కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తుంటే, మరోవైపు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓవర్లోడ్ వాహనాలు నిర్లక్ష్యంగా సంచరించడం ఆ కృషికి గండికొడుతోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో రవాణా, పోలీసు, గనుల శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఓవర్లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే లారీలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాటి రాకపోకలను నియంత్రించాలని కోరుతున్నారు.
ప్రజల సొమ్ముతో నిర్మించిన రహదారులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతేనని, ముఖ్యంగా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఓవర్లోడ్ వాహనాల నియంత్రణపై చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారులు మళ్లీ దెబ్బతిని ప్రజాధనం వృథా కావడంతో పాటు ప్రజలు మరోసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.