కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం
కోటపాడులో తరచూ కరెంటు కోతలు.. ప్రజల ఆగ్రహం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో తరచూ జరుగుతున్న కరెంటు కోతలతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా రాత్రి సమయాల్లో స్వల్ప గాలి వీచినప్పటికీ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.
కరెంటు లేకపోవడంతో చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దోమల బెడద పెరిగి జ్వరాల బారిన పడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో ఇన్వర్టర్లు కూడా పనిచేయకుండా డౌన్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు రెండు గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లలో ఉండలేక బయట రోడ్డుపై ఆరుబయట కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిలిచిపోయిన కరెంటు ఆదివారం ఉదయం పది గంటలైనా పునరుద్ధరించకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు మండిపడ్డారు.
ఇలాంటి తీవ్ర కరెంటు కోతలు గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్న గ్రామస్తులు, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.