కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి
కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి
తాతయ్య, అమ్మమ్మల ఆవేదన
నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి కలకలం
కన్నప్రేమను మరిచి, కన్నకూతురినే కాసుల కోసం విక్రయించిన అమానవీయ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అమ్మ లేని బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, ఆ పసికందును అమ్మకానికి పెట్టిన తీరు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్దగట్టు గ్రామానికి చెందిన ధనావత్ మధు భార్య ప్రసవ సమయంలో మరణించింది. భార్య మరణానంతరం ఆ పసికందు మధు సంరక్షణలోనే ఉంది. అయితే, కొంతకాలంగా పాప కనిపించకపోవడంతో అమ్మమ్మ, తాతయ్యలకు అనుమానం వచ్చింది. పాప గురించి ఆరా తీయగా, ఆ పాప చనిపోయిందని మధు సమాధానం చెప్పాడు. తండ్రి ప్రవర్తనపై అనుమానం కలిగిన బాధిత కుటుంబ సభ్యులు, మధు తన కూతురిని డబ్బుల కోసం ఎవరికో విక్రయించాడని ఆరోపిస్తున్నారు.