కరీంనగర్లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో వందేమాతరం గీతం కార్డుల పంపిణీ
కరీంనగర్లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో వందేమాతరం గీతం కార్డుల పంపిణీ
కరీంనగర్: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో వందేమాతరం పూర్తి గీతం కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్, సప్తగిరి పాఠశాలలకు చెందిన 1200 మంది విద్యార్థులకు ఈ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజ్ఞాభారతి రాష్ట్ర గవర్నర్ కౌన్సిల్ సభ్యుడు ఎల్. రాజ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 1870లో బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను ఏకం చేసిన మహా రణనినాదంగా నిలిచిందని తెలిపారు. ఈ గీతం దేశభక్తికి, మాతృభూమిపై ఉన్న గౌరవానికి ప్రతీకగా మారిందని వివరించారు.
భారత ప్రభుత్వం వందేమాతరం గీతాన్ని గౌరవనీయమైన జాతీయ గేయంగా స్వీకరించిందని పేర్కొన్నారు. యువతలో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి కోశాధికారి జె. సత్యనారాయణ, సహాయ కార్యదర్శి వెచ్చా మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.