లింగపాలెం మండలంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
లింగపాలెం మండలంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద పార్టీ జెండాను ఎగరవేసి, అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా గరిమళ్ళ చలపతిరావు మాట్లాడుతూ, పేద ప్రజల తరపున ఢిల్లీ నాయకత్వానికి ఎదురు నిలిచి పోరాడిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా లోకేష్ యువ నాయకత్వంలో పార్టీ ముందుకు దూసుకుపోతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త పార్టీ గౌరవాన్ని కాపాడాలని, యువత కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నాయకత్వంలో చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల పేద ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు.
మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గజ్జా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీ సెల్ నాయకులు పిల్లల శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ సెల్ నాయకులు తాడేపల్లి దాసుబాబు ఎన్టీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ అనుబంధ సంఘాలు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.