మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపణలపై టీడీపీ నేతల ఘాటు కౌంటర్
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా? వాస్తవాలు తెలుసుకోండి – టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జె. వేణుగోపాలరెడ్డి
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 07/06/2026:
టీడీపీ నేతపై హత్యాయత్నం చేసిన వారిని మాజీ ఎంపీ కేశినేని నాని ఎందుకు సమర్థిస్తున్నారని టీడీపీ రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు జె. వేణుగోపాలరెడ్డి ప్రశ్నించారు. "కేశినేని నాని, మీరు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా?" అని తీవ్రంగా మండిపడ్డారు.
రెడ్డిగూడెంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నియమావళికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వాన్ని అస్థిర పరిచే విధంగా స్థానిక నేతలపై పలు వేదికల ద్వారా బహిరంగంగా మాట్లాడే వారిపై షోకాజ్ నోటీసులు ఇవ్వగా, వారు మరింత ఎక్కువగా వ్యక్తిగత దూషణలు చేస్తున్న సందర్భంలో పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఏ పార్టీ అయినా షోకాజ్ నోటీసు ఇస్తుందని, వివరణ ఇవ్వని సందర్భంలో సస్పెండ్ చేస్తారని స్పష్టం చేశారు.
"ఇదేనా మీ రాజకీయ అనుభవం? వాస్తవాలు తెలుసుకుని పోస్టులు పెట్టండి" అని నానికి హితవు పలికారు. ఇటువంటి చౌకబారు రాజకీయాలకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు.
గతంలో, కేశినేని నాని ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలసి పని చేయలేదా అని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మృదుస్వభావం తెలిసి ఉండకపోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.
ఎవరిమీదైనా కేసులు, అరెస్ట్లు, రిమాండ్లు పోలీసు స్వతంత్రంగా, సాక్ష్యాధారాలు, న్యాయస్థానం ఆదేశాల మేరకే జరుగుతాయని గుర్తుచేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఆదేశాలతో కేసులు పెట్టలేనని, హత్యాప్రయత్నం కేసు పెట్టాలంటే వైద్య నివేదికలు, ప్రత్యక్ష సాక్షులు, ఘటనా స్థలంలో తగిన ఆధారాలు ఉండాలని వివరించారు.
ఇవి అన్ని రాజకీయ దురుద్దేశంతో రూపొందించిన అసత్య ప్రచారం అని ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని కఠినంగా అణచివేస్తోందని, రికార్డులు సాక్ష్యమని పేర్కొన్నారు.
మంచికి అండగా నిలబడే వ్యక్తులు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ఎంపీ కేశినేని చిన్ని. తప్పు చేస్తే ఎవరినీ వెనకేసుకు రారన్నారు.
ఎవరు అక్రమాలు చేస్తున్నారు, ఎవరు నీతులు చెబుతున్నారు అనేది మైలవరం ప్రజలకు తెలుసని, 2024లోనే ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. "మీ స్థాయి మరచి దిగజారి వ్యవహరించి, ఉనికిని కోల్పోయే విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది" అని హితవు పలికారు.
కేశినేని నాని ప్రజారాజ్యం పార్టీ లో ఉన్న సమయంలో జిల్లాలో ఆ పార్టీ అధినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అస్థిరపరిచారు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆదరించి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిపించారు. అయితే అదే పార్టీ అధినేత N. చంద్రబాబు నాయుడు, N. లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేసి, అహంకారపురితంగా వ్యవహరిస్తూ పార్టీని అస్థిర పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. తర్వాత Y. S. జగన్ మోహన్ రెడ్డి పక్షంలో చేరినా, 2024 ఎన్నికల్లో ప్రజలు తమ వైఖరిని గమనించి తీర్పు ఇచ్చారని తెలిపారు.