జగన్ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
జగన్ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్
నియోజకవర్గ రాజకీయాలు, ప్రజా సమస్యలపై చర్చ
తాడేపల్లి | NTODAY NEWS
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అమలాపురం నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన అంశాన్ని డాక్టర్ పినిపే శ్రీకాంత్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, అక్రమ కేసులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అనంతరం కేసులు నమోదైన నాయకులు, కార్యకర్తల వివరాలను జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని స్పష్టం చేసినట్లు తెలిపారు.