మానవత్వం చాటుకున్న ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములుగులంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. కొడుకులు సరిగా చూడక ఇంటి బయట చెట్టు కింద నివసిస్తున్న వృద్ధురాలి పరిస్థితిపై మీడియా గ్రూపుల్లో వార్తలు వెలువడిన వెంటనే స్పందించిన ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.
స్థానికంగా పరిస్థితిని పరిశీలించిన ఎస్సై వెంకన్న, ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి బాధ్యతను గుర్తు చేశారు. అనంతరం వృద్ధురాలిని సమీపంలో ఉన్న మేనమామ ఇంటి వద్ద తాత్కాలికంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, త్వరలోనే ఆమెకు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ ఘటనతో ఎస్సై వెంకన్న మానవత్వం, బాధ్యతాయుత సేవాభావం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఫ్రెండ్లీ పోలీస్ అధికారులు ఉండటంతో ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని లింగపాలెం మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.