మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని..
మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని..
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ..
పట్టణ ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశం..
మదనపల్లె, ఏప్రిల్ 13: మదనపల్లె పోలీస్ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బి.పావని సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2023 వ బ్యాచ్ లో నేరుగా డీఎస్పీ గా ఎంపికైన ఆమెకు ఇదితొలి పోస్టింగ్. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆమె మదనపల్లి లోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ కి పూలమొక్కను అందజేసి విధుల్లో చేరినట్లు నివేదించిన డీఎస్పీకి ఎస్పీ శుభాకాంక్షలు తెలుపుతూ, సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు.
మదనపల్లె పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన ట్రాఫిక్ రద్దీపై ఎస్పీ ప్రత్యేకంగా చర్చించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. అక్రమ పార్కింగ్, రహదారుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించాలి.
డీఎస్పీగా తొలి బాధ్యతలే మదనపల్లె వంటి కీలక డివిజన్లో రావడం శుభపరిణామమని, శక్తివంచన లేకుండా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్, సైబర్ నేరాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం గస్తీ పెంచాలని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. బాధితులు ధైర్యంగా స్టేషన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేలా సిబ్బంది పనితీరు ఉండాలని, తక్షణ న్యాయమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
అనంతరం డిఎస్పీ జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
డీఎస్పీ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లె పట్టణ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడబోనని ఆమె పేర్కొన్నారు.
అన్నమయ్య పోలీస్