మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు
మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు
విజయవాడ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పర్యవేక్షణలో ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గత నెల రోజులుగా 1వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 84 మందిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
ఒకటవ స్పెషల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం న్యాయమూర్తి కాసాని సీతామహాలక్ష్మి తీర్పు ప్రకారం:
ఒకరికి 3 రోజుల జైలు శిక్ష
ఐదుగురికి ఒక్కొక్కరికి 2 రోజుల జైలు శిక్ష
మిగిలిన 78 మందికి కలిపి రూ.7.80 లక్షల జరిమానా
విజయవాడ నగరంలో ప్రతిరోజూ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణనష్టం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
"మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే జరిమానా మాత్రమే కాదు, జైలు శిక్ష కూడా తప్పదని" పోలీసులు హెచ్చరించారు.