మహిళ ఆత్మ హత్యాయత్నం ప్రయత్నం...
పొలం వివాదంలో మహిళ ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య జిల్లా పుంగనూరు
పుంగనూరు మండలం వనమల దిన్నె పంచాయతీ మేకన జామనపల్లి గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఆర్. మురళి భార్య ఆర్. కవిత బుధవారం తన వ్యవసాయ పొలంలో పశువులకు ఉపయోగించే క్రిమిసంహారక ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. మురళికి సంబంధించిన వ్యవసాయ పొలంలో దారి విషయంలో కొన్ని సంవత్సరాలుగా సుధాకర్ నాయుడు, ఆయన కుమారుడు పవన్తో మురళి కుటుంబానికి వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మురళి వ్యక్తిగత పని నిమిత్తం మదనపల్లికి వెళ్లిన విషయం తెలుసుకున్న సుధాకర్ నాయుడు, పవన్ జేసీబీతో తమ పొలాన్ని చదును చేస్తూ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి మురళి పొలంలో దారి కోసం వేయడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం తెలుసుకున్న మురళి భార్య కవిత అక్కడికి వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర మనస్తాపానికి గురైన కవిత పశువులకు ఉపయోగించే క్రిమిసంహారక ద్రావణం తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.