మహిళా బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్కు బుద్ధి చెబుతాం
మహిళా బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్కు బుద్ధి చెబుతాం: మంచిర్యాలలో ఎంపీ ఇంటి ముట్టడికి బీజేపీ యత్నం
మంచిర్యాల: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు శనివారం మంచిర్యాలలో భారీ ఆందోళన చేపట్టాయి. హైటెక్ సిటీలోని ఎంపీ గడ్డం వంశీకృష్ణ నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను, మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ముట్టడిని పోలీసులు నిలువరించడంతో బీజేపీ నేతలు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అడ్డుకోకుంటే ఎప్పుడో అమలు అయ్యేది
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జోగుల శ్రీదేవి మరియు ఇతర మహిళా నాయకురాళ్లు మాట్లాడుతూ, మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ చరిత్ర అంతా అడ్డంకులతోనే నిండి ఉందని విమర్శించారు.
చారిత్రక అడ్డంకులు: 1996లో దేవెగౌడ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే, బయటి నుండి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ దానిని అడ్డుకుందని గుర్తుచేశారు. అలాగే 1998 నుండి 2003 వరకు వాజపేయి ప్రభుత్వం నాలుగుసార్లు ప్రయత్నించినా కాంగ్రెస్ సహకరించలేదని మండిపడ్డారు.
యుపిఏ హయాంలో వైఫల్యం: 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినా, లోక్సభలో కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా వెనకడుగు వేసి మహిళలకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ చిత్తశుద్ధిని అడ్డుకుంటున్నారు
2023లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించిందని వారు పేర్కొన్నారు. 2026 జనగణన మరియు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం స్పష్టంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు కుట్రపూరితంగా మళ్ళీ అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు అమలును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు
ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్, జిల్లా నాయకులు బేర సత్యనారాయణ, మహిళా నేతలు పచ్చ స్వప్న, మెతె సుజాత, మంద స్వాతి, సురచి స్వాతి, శ్రీరాంపూర్ మహిళా మోర్చా నాయకురాలు జిట్టవేని రేణుక, ప్రధాన కార్యదర్శి బొంగోని శిరీష పాల్గొన్నారు.
అలాగే గర్మిళ్ల జోన్ అధ్యక్షురాలు బైరం లక్ష్మి, మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు, సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి, ప్రధాన కార్యదర్శులు పొన్నవేని సదయ్య, చిరంజీవి, బద్రి శ్రీకాంత్, రమణవేణి శ్రీనివాస్, నేరేడుగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొని కాంగ్రెస్ వైఖరిని ఖండించారు