మహిళా పోలీసులకు గుడ్న్యూస్.. మహిళా శిశు సంక్షేమ శాఖలో 710 మందికి కొత్త బాధ్యతలు
రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 13,912 మంది మహిళా పోలీసులు త్వరలో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. వారు ఏ శాఖలో పనిచేయాలనుకుంటున్నారనే అంశంపై వారి అభీష్టం మేరకు సచివాలయాల శాఖ ఆప్షన్లు సేకరించింది.
ఈ ప్రక్రియలో మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంపిక చేసుకున్న మహిళా పోలీసుల్లో ప్రస్తుతం ఆ శాఖ అవసరాలకు అనుగుణంగా 710 మందిని ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రస్తుతం వీరంతా సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున, ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత కొత్త బాధ్యతల్లో చేరనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో 257 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్టు పరిధిలో మూడు నుంచి నాలుగు మండలాలు ఉండగా, ప్రస్తుతం కేటాయించిన 710 మందిని మండలానికి ఒకరు చొప్పున నియమించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అలాగే, ఏ జిల్లా పరిధిలోని మహిళా పోలీసులకు అదే జిల్లాలో పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతానికి వీరిని డిప్యుటేషన్ ప్రాతిపదికన మహిళా శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం వారి పదోన్నతులు, శాశ్వత నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఈ నిర్ణయంతో మహిళా శిశు సంక్షేమ శాఖలో క్షేత్రస్థాయిలో సేవలు మరింత బలోపేతం కావడంతో పాటు, మహిళలు, చిన్నారుల సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.