www.ntodaynews.com
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగింపు
తెలంగాణ
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగింపు: రథోత్సవం, తెప్పోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
మహాశివరాత్రి సందర్భంగా నవాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్న పదకొండు రోజుల బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజున విశేషంగా కొనసాగాయి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.
యాగశాలలో చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, లోకక్షేమం కోసం జపాలు, పారాయణాలు చేశారు. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి జపం, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం కార్యక్రమాలు ఆగమశాస్త్ర విధానంలో నిర్వహించబడ్డాయి. సాయంత్రం ప్రదోషకాల పూజలు, రుద్రపారాయణాలు, హోమాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
రథోత్సవం ఈ సాయంత్రం
ఫిబ్రవరి 16 సాయంత్రం రథోత్సవం నిర్వహించబడుతుంది. సంప్రదాయం ప్రకారం ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి నిర్వహిస్తారు. రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, అన్నరాశితో కూడిన కుంభాన్ని సాత్వికబలిగా సమర్పిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్ఠించి ఊరేగింపు చేపడతారు.
రథాన్ని బంతి, చామంతి, గులాబీలు, కనకాంబరం, గ్లాడియోలస్, ఆస్టర్స్ తదితర 11 రకాల పుష్పాలతో అలంకరించారు.
రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం
అదే రోజు రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ముందుగా ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించి, పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పపై ప్రతిష్ఠిస్తారు. వేదమంత్రాల నడుమ మంగళవాయిద్యాలతో శాస్త్రోక్తంగా తెప్పోత్సవం కొనసాగుతుంది.
తెప్ప అలంకరణలో ఎరుపు, పసుపు బంతి, తెల్ల చామంతి, గులాబీలు, కనకాంబరం, ఆస్టర్, జబ్రా, గ్లాడియోలస్, ఆర్కిడ్స్ తదితర పుష్పాలు వినియోగించారు. విద్యుత్ దీపాలంకరణతో తెప్ప ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడింది.
ఉత్సవాలను దర్శించేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున సమగ్ర ఏర్పాట్లు చేపట్టినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
#Srisailam #Mahashivaratri #TempleFestival #Rathotsavam #Teppotsavam #SpiritualIndia
Follow us on
Website
Facebook
Instagram
YouTube