మలద్వారంలో బంగారం.. జెడ్డా నుంచి అహ్మదాబాద్కు అక్రమ తరలింపు
మలద్వారంలో బంగారం.. జెడ్డా నుంచి అహ్మదాబాద్కు అక్రమ తరలింపు
ఒంట్లోనే అరకిలో బంగారం.. ఎయిర్పోర్టులో అడ్డంగా బుక్కు!
అహ్మదాబాద్: బంగారం అక్రమ రవాణాకు కొందరు ఎంచుకుంటున్న మార్గాలు అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా జెడ్డా నుంచి అహ్మదాబాద్కు వచ్చిన ఓ యువకుడు దాదాపు అరకిలో బంగారాన్ని తన శరీరంలో దాచుకుని తరలించేందుకు ప్రయత్నించి విమానాశ్రయ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం.. ఖతార్ ఎయిర్వేస్ విమానంలో 24 ఏళ్ల సర్ఫరాజ్ మాలా జెడ్డా నుంచి అహ్మదాబాద్ చేరుకున్నాడు. విమానం దిగిన అనంతరం టెర్మినల్ నుంచి బయటకు వెళ్తుండగా అతడి ప్రవర్తనపై తనిఖీ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో అధికారులు అతడిని ఆపి లోహ గుర్తింపు పరికరంతో పరిశీలించారు. ఈ సందర్భంగా అతడి శరీరంలో లోహ పదార్థం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్యుల సహాయంతో పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. బంగారాన్ని ప్రత్యేకంగా మలిచి మలద్వారంలో దాచుకుని దేశంలోకి తీసుకొచ్చేందుకు అతడు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. వైద్యుల సహకారంతో దాచిన బంగారాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 467.09 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.65.69 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానాశ్రయంలో ఎన్ని తనిఖీలు ఉన్నప్పటికీ అక్రమ రవాణాదారులు కొత్త మార్గాలను ఎంచుకుంటుండటం అధికారులకు సవాలుగా మారుతోంది.