మంచిర్యాల ఎమ్మెల్యేపై నడిపెల్లి విజిత్ కుమార్ తీవ్ర ఆరోపణలు
మంచిర్యాల ఎమ్మెల్యే తీరుపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు నివాసం (LIC కాలనీ) వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పదవిని ప్రజా సేవ కోసం కాకుండా, కేవలం దోచుకోవడానికి, దాచుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నారని విమర్శించారు.
అభివృద్ధి మాది.. పేరు మీదా?
ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రతిపాదన మరియు ఆలోచన నడిపెల్లి దివాకర్ రావు దేనని విజిత్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎల్లంపల్లిలో టూరిజం మరియు ఆక్వా ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయించారని, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే వాటిని తానే చేసినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. అలాగే లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిని కట్టించింది దివాకర్ రావు అయితే, ఎమ్మెల్యే అక్కడ పదిసార్లు విజిట్ చేస్తూ తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
నిధుల గోల్మాల్ - అడ్డగోలు అవినీతి
మంచిర్యాలలో జరుగుతున్న అవినీతిపై విజిత్ కుమార్ మండిపడుతూ.. 4 కోట్ల స్మశాన వాటిక పనులకు ఏకంగా 14 కోట్ల బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. గోదావరి కరకట్ట విషయంలోనూ ఎస్టిమేట్లు పెంచి నిధులు కాజేశారని, వేంపల్లి-పోచంపాడు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దళితులకు చెందిన 500 కోట్ల విలువైన భూములను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి, ఇసుక, కొండలు, చెరువులు ఇలా దేనిని వదలకుండా లూటీ చేస్తున్నారని విమర్శించారు.
బ్యాంకు అప్పులు ఎలా తీరాయి?
"ఏళ్ల తరబడి బ్యాంకుల్లో ఉన్న మీ 500 కోట్ల పాత అప్పులు, కేవలం ఈ రెండు సంవత్సరాలలో వడ్డీతో సహా ఎలా తీరాయి?" అని విజిత్ కుమార్ నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించి, మంచిర్యాల ప్రజల సొమ్మును దోచుకెళ్లి తన వ్యక్తిగత బ్యాంకు అప్పులను కట్టుకున్న విషయం ప్రజలకు తెలుసని అన్నారు.
దేవాలయాల వద్ద రాజకీయాలు
గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు వేయించి భక్తులకు సౌకర్యం కల్పించింది దివాకర్ రావేనని గుర్తు చేశారు. విశ్వనాథ ఆలయానికి మంజూరైన 2 కోట్ల రూపాయల నిధులను, దివాకర్ రావుకి పేరు వస్తుందనే అక్కసుతో ప్రస్తుత ఎమ్మెల్యే అడ్డుకున్నారని, దేవుని దగ్గర కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
బినామీల గుట్టు రట్టు.. అధికారులకు హెచ్చరిక
ఎమ్మెల్యేకు మరియు ఆయన బినామీలకు మధ్య దోచుకున్న వాటాల పంపిణీలో విభేదాలు వచ్చాయని, త్వరలోనే అన్ని ఆధారాలతో వీరి అవినీతి లెక్కలను బయటపెడతామని నడిపెల్లి విజిత్ కుమార్ హెచ్చరించారు. ఎమ్మెల్యే అండతో ఇష్టానుసారంగా బిల్లులు మంజూరు చేస్తున్న అధికారులు, రేపు బిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు