దేశంలో మోసకారితనమే మిగిలింది..!
రైతే దేశానికి వెన్నెముక అని వేదికలపై గొప్పలు చెప్పే కేంద్ర ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అన్నదాతను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోందన్న విమర్శలు మరింత బలపడుతున్నాయి. 2026-27 సీజన్కు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతాంగాన్ని ఊరటపరచలేకపోయాయి. ఎరువులు, పురుగుల మందులు, డీజిల్, యంత్రాల నిర్వహణ ఖర్చులు 20-30 శాతం వరకూ పెరిగిపోయిన పరిస్థితుల్లో, మద్దతు ధరల్లో మాత్రం స్వల్ప పెంపులతో సరిపెట్టడం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది.
ధాన్యానికి క్వింటాకు కేవలం రూ.72 పెంపు, మొక్కజొన్నకు రూ.10, పెసలుకు రూ.12 మాత్రమే పెంచడం ద్వారా ప్రభుత్వం రైతుల వాస్తవ కష్టాలను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ రంగం ఇప్పటికే వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, యుద్ధ పరిస్థితులు, ఎగుమతుల మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతుండగా.. రైతుకు బలంగా నిలవాల్సిన ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్వామినాథన్ కమిషన్ సూచించిన “సి2 + 50 శాతం” ఫార్ములాను అమలు చేస్తేనే రైతుకు కనీస న్యాయం జరుగుతుందని రైతు సంఘాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా, కేంద్రం దానిపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. పైగా ఎరువుల సబ్సిడీల కోతలు, మార్కెట్ శక్తుల ఆధీనంలో రైతును వదిలేయడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది.
అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తుంటే.. భారత రైతాంగంపై మాత్రం భారాలు మోపడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతు బతికితేనే దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందనే వాస్తవాన్ని గుర్తించి, వ్యవసాయ రంగానికి నిజమైన భరోసా కల్పించే విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రైతు పేరుతో చేసే ప్రతి హామీ.. మోసకారితనంగానే మిగిలిపోతుంది.