CM వాహన శ్రేణికి కత్తెర.. 50 శాతం తగ్గింపునకు ఆదేశాలు
పొదుపు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను 50 శాతం మేర తగ్గించాలని అధికారులను ఆదేశించారు. పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇకపై జిల్లా పర్యటనల సమయంలో అవసరమైన వాహనాలనే వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు ప్రధానాధికారి, నిఘా విభాగ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా వాహన శ్రేణుల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.