ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పాలమూరు సమస్యలు.. బహిరంగ లేఖతో జేఏసీ వినతి
షాద్నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో, ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు బహిరంగ లేఖను విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పాలమూరు ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఇంకా వెనుకబడిన పరిస్థితుల్లో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా ప్రజల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగునీటి సమస్యను శాశ్వతంగా నివారించాలని జేఏసీ కోరింది. అలాగే కృష్ణా జలాల్లో జిల్లాకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా షాద్నగర్ ప్రాంతంలో ప్రతిపాదిత పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.
పాలమూరు ప్రాంతంలో వలసల సమస్య ఇప్పటికీ పూర్తిగా నివారణ కాలేదని, తాగునీరు, సాగునీరు, ఉపాధి, రహదారులు, పరిశ్రమలు వంటి మౌలిక అవసరాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి ప్రాంతీయ అసమానతలను తొలగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచినా పాలమూరు ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదని పేర్కొంటూ, జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉద్యమ నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని బహిరంగ లేఖకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల గిరి శ్రీనివాస్, రవీంద్రనాథ్, మందారం నరసింహులు, రామారావు, నరసన్న, కృష్ణయ్య, నరసింహులు గౌడ్, తిరుమలయ్య, కృష్ణ, సత్యం, మేకల వెంకటేష్, ముదిరాజ్ రవికుమార్, పద్మారం వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.