ములుగు నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ ఆరోపణలు
ములుగు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.4 వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు మంత్రులు ప్రణాళిక రచించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీతమ్మ సాగర్ ప్రాంతంలో డిసిల్టేషన్కు అధికారిక అనుమతులు లేకపోయినా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ సభ నిర్వహించకుండా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి చేసి ఇసుక రవాణా ప్రారంభించారని చెబుతున్నారు.
అలాగే సుమారు 12 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన యువకులపై కేసులు నమోదు చేయడం వివాదానికి దారితీసింది.
ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.