ముంబైలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతున్న కోవిడ్ కేసులు..!
దేశాన్ని ఒకప్పుడు వణికించిన కరోనా వైరస్ మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక రాజధాని ముంబైలో గత వారం రోజులుగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే వైరల్ ఇన్ఫెక్షన్లు పెరగడం ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది.
బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చెందిన పాథాలజీ నిపుణుడు డాక్టర్ సంజయ్ మేహతా మాట్లాడుతూ, ప్రస్తుతం ముంబైలో స్వైన్ ఫ్లూ, ఇన్ఫ్లూయెంజా, కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. తమ ప్రయోగశాలలో ప్రతిరోజూ సుమారు ఏడు కోవిడ్ లేదా స్వైన్ ఫ్లూ కేసులు గుర్తిస్తున్నట్లు చెప్పారు.
నెల రోజుల క్రితం వరకు స్వైన్ ఫ్లూ కేసులే ఎక్కువగా ఉండేవని, అయితే గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయని వెల్లడించారు. బ్రీచ్ క్యాండీ, బాటియా ఆస్పత్రుల్లో ఒక్కో కరోనా రోగి చికిత్స కోసం చేరినట్లు తెలిపారు. అధిక జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.