ముసునూరులో మట్టి తవ్వకాల వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు గ్రామంలో మట్టి తవ్వకాల అంశం ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం మట్టి విక్రయాల ధరల విషయంలో తలెత్తిన వివాదంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం ఘర్షణకు దారితీసింది.
స్థానికుల కథనం ప్రకారం, అవసరమైన వారికి ట్రక్కు మట్టిని రూ.120కే అందిస్తామని గ్రామంలో చాటింపు వేయగా, వాస్తవంగా రూ.200 వరకు వసూలు చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహీకి దారితీసింది.
ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మట్టి తవ్వకాల నిర్వహణ, ధరల నిర్ణయంలో పారదర్శకత లేకపోవడమే ఈ వివాదానికి కారణమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, మట్టి తవ్వకాలకు అవసరమైన అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.