www.ntodaynews.com
ముత్తునూర్ గోదావరి లిఫ్ట్ పునఃప్రారంభం
తెలంగాణ
ముత్తునూర్ గోదావరి లిఫ్ట్ పునఃప్రారంభం
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్
రైతుల ఇబ్బందులు తొలగించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్ మండలంలోని ముత్తునూర్ గ్రామంలో నిలిచిపోయిన గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గురువారం తిరిగి ప్రారంభించారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్లను దొంగిలించడంతో సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రూ. 81 లక్షలతో మరమ్మతులు
రైతుల సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. దీనికి స్పందనగా రూ. 81 లక్షల నిధులను మంజూరు చేస్తూ తక్షణమే జీవో జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయడంతో గోదావరి లిఫ్ట్ తిరిగి పనిచేయడం ప్రారంభమైంది.
రైతుల పక్షాన ప్రభుత్వం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. ముత్తునూర్తో పాటు ఆరేపల్లి, జైన రాజారాం, మండపేట, రాయపట్నం, తిమ్మాపూర్ గ్రామాల రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా లిఫ్ట్ నిర్వహణను కాంట్రాక్టర్ ద్వారా నిరంతర పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు.
దొంగతనాలపై అప్రమత్తత అవసరం
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరెంట్ ఆన్–ఆఫ్ సమస్యల వల్ల మోటార్లు దెబ్బతినకుండా విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు. సన్నవడ్లకు బోనస్, నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
#GodavariLiftIrrigation
#FarmersRelief
#IrrigationDevelopment
#TelanganaAgriculture
#CongressGovernment
#Velgatur
#FarmersIssues
#RuralDevelopment
Follow us on
Website
Facebook
Instagram
YouTube