చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు
అంగన్వాడీలో నాణ్యత లేని పాలు.. తల్లిదండ్రుల ఆందోళన
చిత్తూరు | N Today News
చిత్తూరు నగర పరిధిలోని 50వ వార్డు చవటపల్లిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పాల నాణ్యతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రం నుంచి పిల్లల తల్లులకు అందజేసిన పాలను ఇంటికి తీసుకెళ్లి పరిశీలించగా అవి చెడిపోయినట్లుగా గుర్తించామని తల్లులు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే అంగన్వాడీ టీచర్ దృష్టికి తీసుకెళ్లగా, ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
చిన్నారులకు అందించే పాలు, ఆహార పదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో కూడా అంగన్వాడీ కేంద్రంలో చెడిపోయిన కోడిగుడ్లను పంపిణీ చేశారని, అప్పట్లో కూడా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్న పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.