నేరడలో పశువులకు ఉచిత టీకాలు
నేరడలో పశువులకు ఉచిత టీకాలు, నేరడ లో ఉచిత పశువైద్య శిబిరం
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పాడి రైతులు పశువైద్య శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని, తమ మూగజీవాలను ఆరోగ్యంగా కాపాడుకోవాలని చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్ర వినోద పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని నేరడ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గాలికుంటు వ్యాధి నిర్మూలన టీకా కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం, వాతావరణ మార్పుల నేపథ్యంలో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకాలను ప్రతి రైతు తమ పశువులకు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పశువైద్య అధికారులు, గ్రామ కార్యదర్శి, స్థానిక నాయకులు మరియు పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.